అవినీతి నేలగా తణుకు, దోచిన సొమ్ముతో మంత్రి కారుమూరి ఫ్యాక్టరీలు పెట్టారు : పవన్ కల్యాణ్
తణుకు: వైసీపీ పాలనలో తణుకు అవినీతి నేలగా మారిపోయిందని జనసేన అధినేత పవన్ ఓ రేంజ్లో ఫైరయ్యారు. స్థానిక మంత్రి కారుమూరి నాగేశ్వరరావు దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోయిందని విమర్శించారు. అవినీతి సొమ్మును మంత్రి హైదరాబాద్ తరలించాడని, బాలానగర్లో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేశారని పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.పంటకు మొలకలు వస్తున్నాయని రైతులు చెబితే మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చిన్న చూపు చూశారని పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు. దేశానికి అన్నం పెట్టే రైతును మంత్రి ఏడిపించారని గుర్తుచేశారు. ఆ మంత్రి కుమారుడు ఎన్నికల బరిలో ఉన్నారని, అతనికి బుద్ది చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వైసీపీ మంత్రుల తీరు సరిగా లేదని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు గురించి అడిగితే ఇరిగేషన్ మంత్రి డ్యాన్సులు చేస్తాడని.. బూతులు తిట్టే మరో మంత్రి ఉన్నాడని మండిపడ్డారు. మంత్రులు బాధ్యత మరిచారని పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో జగన్ పాలనకు స్వస్తి పలకాలనే ఉద్దేశంతో కొన్ని త్యాగాలు చేశామని పవన్ కల్యాణ్ వివరించారు. టికెట్ల కేటాయింపులో త్యాగాలు చేయాల్సి వచ్చిందని గుర్తుచేశారు. అనకాపల్లి నుంచి అన్నయ్య నాగబాబు పోటీ చేయాల్సి ఉందన్నారు. పొత్తు వల్ల టికెట్ త్యాగం చేయాల్సి వచ్చిందని వివరించారు. సీఎం జగన్ క్లాస్ వార్ అంటున్నారు.. క్లాస్ వార్ అంటే.. డబ్బున్న వారు పేదవారిని దోచుకోవడమా..? అని పవన్ కల్యాణ్ అడిగారు. మధ్య తరగతి వారు, పేదల సమస్యలు తనకు తెలుసు అని పవన్ కల్యాణ్ అన్నారు. ఉద్యోగుల సీపీఎస్ సమస్య పరిష్కరించే ప్రయత్నం చేస్తామని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాదిలోపు పరిష్కరిస్తామని హామీనిచ్చారు.
What's Your Reaction?