ఏపీ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్.. హీటెక్కిన బెజవాడ రాజకీయం?
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ఇదే క్రమంలో.. కీలక నేతలు పార్టీలు మారడం వంటి ఊహించని పరిణామాలూ చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు తాజాగా వంగవీటి రాధాకృష్ణ గుంటూరులో జనసేన నేత వల్లభనేని బాలశౌరిని కలవడం హాట్ టాపిక్గా మారింది. వీరి మధ్య చర్చలు దాదాపు గంటసేపు కొనసాగాయి. అంతకుముందు.. తెనాలిలో రాత్రి నాదెండ్ల మనోహర్తోనూ రాధా భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే.. ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఊహాగానాలు రేకెత్తుతున్నాయి. తనకు టీడీపీ నుంచి సీటు దక్కకకపోవడంతో.. జనసేనలోకి చేరి, అవనిగడ్డ నుంచి పోటీ చేయాలని రాధా ప్రణాళికలు రచిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీనిపై పూర్తి స్పష్టత లేదు కానీ.. రాధా వరుస భేటిలతో బెజవాడ రాజకీయం హీటెక్కింది,
ఇదిలావుండగా.. వంగవీటి రాధాకృష్ణ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2004 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి.. బీజేపీ అభ్యర్థి ఏలేశ్వరపు జగన్ మోహన్ రాజుపై గెలుపొంది, తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అనంతరం 2008లో ఆయన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అయితే.. 2009 ఎన్నికల్లో అదే స్థానం నుంచి పోటీ చేసిన ఆయన, కాంగ్రెస్ అభ్యర్థి మల్లాది విష్ణు చేతిలో ఓడిపోయారు. 2014 ఎన్నికల ముందు వైసీపీలో చేరిన ఆయన.. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావు చేతిలో ఓటమి చవిచూశారు. 2019లో తనకు టికెట్ దక్కకపోవడంతో.. అదే సంవత్సరంలో ఆ పార్టీని వీడి టీడీపీలో చేరారు. ఇప్పుడు ఆయన జనసేన నేతలతో వరుసగా భేటీ అవుతుండటంతో.. పార్టీ మారనున్నారా? అనే ప్రచారం ఊపందుకుంది.
What's Your Reaction?