ఆంధ్రప్రదేశ్ - పిఠాపురంలో 'సర్వే' సంచలనం..
Pithapuram Pawan Kalyan
అసెంబ్లీ ఎన్నికల సమరభేరి మోగింది. మే 13వ తేదీన పోలింగ్ జరగనుండగా జూన్ నాలుగోతేదీన ఫలితాలు వెలువడతాయి. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల్లో తలపడేందుకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. వైసీపీ, తెలుగుదేశం కన్నా ప్రధానంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి పోటీచేయనున్నారు? అక్కడ పార్టీ పరిస్థితి ఏమిటి? గెలవడానికి ఎటువంటి అంశాలు దోహదపడనున్నాయి? తదితర అంశాలపైన రాష్ట్రవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. బీజేపీ, తెలుగుదేశంతో కలిసి కూటమిగా ఏర్పడిన జనసేనాని తాను ప్రత్యక్షంగా పోటీచేసే నియోజకవర్గంగా పిఠాపురాన్ని ఎంచుకున్నారు
పవన్ ఎప్పుడైతే పిఠాపురం నుంచి పోటీచేస్తున్నట్లు ప్రకటించారో అప్పటినుంచి సర్వే సంస్థలన్నీ అక్కడ వాలిపోయాయి. ప్రధాన సర్వే సంస్థలతోపాటు కొన్ని మీడియా సంస్థలు కూడా ఇక్కడ సర్వేలు చేస్తున్నాయి. పవన్ కల్యాణ్ ను ఓడించేందుకు కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను పిఠాపురం అభ్యర్థిగా జగన్ బరిలోకి దించారు. కాపు సామాజికవర్గానికి చెందిన ఓట్లు 91వేలు ఉన్నాయి.
కాపుల ఓట్లలో చీలకద్వారా విజయం సాధించాలనేది వైసీపీ భావనగా ఉంది. అయితే పవన్ ఎప్పుడైతే పిఠాపురం పేరు ప్రకటించారో అప్పటినుంచి వాతావరణం మారిపోయిందని, పిఠాపురం లోని కాపులంతా తమ ఓట్లను చీలనివ్వకుండా పవన్ కల్యాణ్ కు ఓటు వేసి అసెంబ్లీకి పంపించాలనే నిర్ణయానికి వచ్చినట్లు సర్వే సంస్థలు వెల్లడిస్తున్నాయి. ఒకటి, రెండు సంస్థల సర్వేలు మినహా దాదాపుగా అన్ని సర్వేలు జనసేనానికి అనుకూలంగా వస్తున్నట్లు తెలుస్తోంది.
పవన్ బరిలోకి దిగినప్పటికీ తెలుగుదేశం పార్టీ నుంచి వర్మ బరిలోకి దిగితే ఒకలా, దిగకపోతే మరోలా, వైసీపీ నుంచి మహిళా అభ్యర్థి అయితే ఇంకోలా.. అంటూ విభిన్నరకాలుగా సర్వేలు సాగాయి. ఎన్నివిధాలుగా, ఎన్ని అంశాలతో సర్వేలు జరిగినప్పటికీ పవన్ కల్యాణ్ వైపే మొగ్గు ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నాయి.
What's Your Reaction?